ఇంకా పూర్తికాని మట్టి దార్లు ఎన్నో కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి.ఈ దారుల వెంట సౌరాలోని ఆసుపత్రికి చేసే ప్రయాణం ఒక నిరంతర పోరాటం. కొడుకు మొహసిన్ వైద్యం కోసం ముబీనా, అర్షీద్ హుస్సేన్ అఖూన్లు కనీసం నెలకొకసారి ఆసుపత్రికి వెళ్ళాల్సివస్తుంటుంది. దాదాపు తొమ్మిదేళ్ళ వయసున్న పిల్లవాడిని అర్షీద్ తన చేతుల్లో ఎత్తుకుని, మురుగు నీరు, కరిగే మంచు పొంగి పారే రఖ్-ఎ-అర్థ్ పునరావాస కాలనీ వీధుల గుండా మోసుకుపోతారు.
సాధారణంగా ఒక రెండు-మూడు కిలోమీటర్లు నడిచాక వారికి ఏదో ఒక ఆటో దొరుకుతుంది. ఆ ఆటో వాళ్ళని అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో, ఉత్తర శ్రీనగర్లొని సౌరా ప్రాంతంలో ఉన్న షేర్-ఎ-కశ్మీర్ మెడికల్ సైన్సెస్ వరకూ చేరుస్తుంది. అందుకు వారికి రూ. 500 ఖర్చవుతుంది. కొన్నిసార్లు- ప్రత్యేకించి క్రిందటి సంవత్సరం లాక్డౌన్ల సమయంలో - కుటుంబమంతా ఆసుపత్రి వరకూ మొత్తం దూరం నడవవలసి వచ్చేది. “అందుకు ఒక రోజంతా పడుతుంది,” అన్నారు ముబీనా.
ఇంచుమించు తొమ్మిది సంవత్సరాల క్రితం ముబీనా, అర్షీద్ల ప్రపంచమే మారిపోయింది. 2012లో పుట్టిన కొన్ని రోజులకే మొహసిన్కు జ్వరం, పచ్చకామెర్లు వచ్చి, శరీరంలో బిలిరుబిన్ స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. అప్పటినుంచి వరుసగా వైద్యులకు చూపించడం మొదలుపెట్టారు. శ్రీనగర్లోని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జి.బి. పంత్ పిల్లల ఆసుపత్రిలో రెండు నెలలు గడిపాడు మొహసిన్. చివరికి, ఆ పసివాడు ‘అపసవ్యత’తో ఉన్నాడని వాళ్ళకి తేల్చిచెప్పారు.
“బాబు పరిస్థితి మెరుగుపడకపోయేసరికి, మేమొక ప్రైవేటు వైద్యుణ్ణి సంప్రదించాం. పిల్లవాడి మెదడు పూర్తిగా దెబ్బతిందని, ఇంకెప్పటికీ వాడు కూర్చోలేడనీ మాట్లాడలేడనీ, ఆ వైద్యుడు మాకు చెప్పారు." అని 30యవవడిలో ఉన్న ముబీనా ఆ రోజులను జ్ఞాపకం చేసుకున్నారు.
మొహసిన్కు సెరిబ్రల్ పాల్సీ (మెదడుకు వచ్చే పక్షవాతం) అని చివరకు నిర్ధారించారు. అప్పటినుండి కొడుకుకూ, అతని ఆరోగ్యానికీ అవసరమైన సేవలు చేస్తూనే ముబీనా తన సమయాన్నంతా గడుపుతున్నారు. “పిల్లాడి మూత్రాన్ని శుభ్రం చేసి, మంచం కడిగి, బట్టలుతికి, కూర్చోబెట్టాలి. రోజంతా పిల్లాడు నా ఒళ్ళోనే ఉంటాడు.” అని ఆమె చెప్పుకొచ్చారు.










