ఒక సార్వత్రిక ఎన్నికలలో వోటు వేసే అవకాశం రావటం బబ్లూ కైబర్తాకు ఇది రెండవసారి.
బబ్లూ గత ఎన్నికలలో మొదటిసారి వోటు వేసేందుకు వెళ్ళినపుడు అధికారులు అతనిని వెంటనే వెళ్ళనిచ్చారు. అతనికి ఏ క్యూలోనూ నిల్చోవాల్సిన అవసరం రాలేదు. కానీ పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లా, పల్మా గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్లోకి వెళ్ళాక బబ్లూకు తన వోటు ఎలా వెయ్యాలో తెలియలేదు.
24 ఏళ్ళ బబ్లూకు దృష్టి లోపం ఉంది. 2019 సాధారణ ఎన్నికల నుంచి పోలింగ్ కేంద్రంగా కూడా పనిచేస్తోన్న ఆ ప్రాథమిక పాఠశాలలో బ్రెయిలీ భాషలో ఉన్న బ్యాలట్ పత్రాలు గానీ, బ్రెయిలీ ఇవిఎమ్ (ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్) గానీ లేవు.
"నాకేం చేయాలో తోచలేదు. నాకు సాయం చేస్తోన్న వ్యక్తి ఎన్నికల గుర్తుల గురించి అబద్ధం చెప్తే నేనేం చేయాలి?" డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోన్న బబ్లూ అడిగాడు. సహాయకుడిగా ఉన్న వ్యక్తి నిజమే చెప్పినా కూడా, రహస్య బ్యాలట్ అనే తన ప్రజాస్వామిక హక్కును అతిక్రమించినట్టే కదా అని బబ్లూ వాదిస్తాడు. కొద్దిగా ఇబ్బందిపడుతూ బబ్లూ తనకు సూచించిన గుర్తుపై మీటను నొక్కాడు. బయటకు వచ్చాక అది తాను అనుకున్న గుర్తు అవునో కాదో రూఢి చేసుకున్నాడు. "ఆ వ్యక్తి నాకు అబద్ధం చెప్పలేదు, అందుకు కృతజ్ఞుడిని," అంటాడు బబ్లూ.
PWD (వైకల్యం ఉన్నవారు) - అనుకూల బూత్లలో బ్రెయిలీ బ్యాలెట్లు, ఇవిఎమ్ల ఏర్పాటును భారత ఎన్నికల సంఘం తప్పనిసరి చేసింది. "ఉండటానికి కాగితాలపై చాలా నిబంధనలే ఉన్నాయి" అని కొల్కతాకు చెందిన శ్రుతి వికలాంగుల హక్కుల కేంద్రం డైరెక్టర్ శంపా సేన్గుప్తా చెప్పారు. "కానీ అమలు మాత్రం పేలవంగా ఉంటుంది."
సార్వత్రిక ఎన్నికలు మళ్ళీ దగ్గరకు వచ్చాయి, అయితే 2024 సార్వత్రిక ఎన్నికల ఆరవ దశలో వోటు వేయడానికి తాను ఇంటికి వెళ్ళాలా వద్దా అనేది ఇప్పటికింకా బబ్లూ నిర్ణయించుకోలేదు. మే 25న పోలింగ్ జరగనున్న పురూలియాలో బబ్లూ వోటరుగా నమోదై ఉన్నాడు.





