"నా విద్యార్థుల పట్ల ఎలాంటి షరతులు లేని ప్రేమ, వారిని సంపూర్ణంగా స్వీకరించడం. ఇవే నేనొక అధ్యాపకురాలిగా నేర్చుకున్నది!"
మేధా తెంగ్షె మృదువుగా, కానీ చాలా దృఢంగా తన అభిప్రాయాన్ని చెప్పారు. ప్రత్యేక అధ్యాపకురాలైన ఈమె, సాధన గ్రామం వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఇక్కడ వయసు రీత్యా, మేధో సామర్థ్యం రీత్యా వివిధ స్థాయిలలో ఉండే 30 మందికి కళ, సంగీతం, నాట్యంతో సహా ప్రాథమిక జీవన నైపుణ్యాలను నేర్పిస్తుంటారు.
సాధన గ్రామం పుణే జిల్లాలోని ముల్షి బ్లాక్లో ఉంది. ఇది మేధోపరమైన వైకల్యాలున్న ఎదిగిన వయసు వ్యక్తులు నివాసముండే ఒక సంస్థ. ఇక్కడి విద్యార్థులను 'ప్రత్యేక మిత్రులు' గా వ్యవహరిస్తారు. శిక్షణ పొందిన జర్నలిస్టు అయిన మేధా తాయి, ఇక్కడ నివాసముండే పదిమందికి తనను తాను గృహ మాతగా, తాను నిర్వహిస్తోన్న పాత్రను "ఒక తల్లిగా, బోధకురాలిగా" నిర్వచించుకుంటారు.
పుణేలోని వినికిడి లోపం ఉన్నవారికోసం నడిచే ధాయరీ పాఠశాలకు చెందిన ప్రత్యేక అధ్యాపకురాలు సత్యభామ అల్హాట్ కూడా ఈ భావంతో ఏకీభవిస్తున్నారు. "మా పాఠశాల వంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఆ పిల్లలకు తల్లిదండ్రులవంటివారు కూడా. మేం మా పిల్లలను ఇంటిపై బెంగపడేలా చేయాలనుకోం," ఆరోజు నాగపంచమి కావటంతో కొంతమంది బాలికలకు ఫుగడి ఎలా ఆడాలో బోధించేందుకు వారివైపుకు తిరుగుతూ PARIతో చెప్పారామె. ఫుగడి శ్రావణ మాసంలో ఐదవ రోజైన నాగపంచమి పండుగ రోజున సంప్రదాయంగా ఆడే ఒక ఆట. ప్రాథమిక పాఠశాల అయిన ధాయరీలో 40 మంది విద్యార్థులు పాఠశాలలోనే నివాసముంటుండగా, 12 మంది బయటి నుంచి రోజూ వచ్చే విద్యార్థులు. వీరంతా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకూ, కర్ణాటక, దిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి ఇతర ప్రదేశాలకూ చెందినవారు.
































