ఇంటి బయట మంచం మీద కూర్చుని, 40 ఏళ్ళ మలన్ తన అమ్మ కోసం ఎదురుచూస్తోంది. ఆమె తనకు ఇష్టమైన పువ్వుల బ్లౌజు, మడమల దాకా ఉన్న పావడా వేసుకుంది. నన్ను చూసి ఆమె మొహం వెలిగింది. క్రితం సారి వారింటికి నేను వచ్చానని గుర్తుపట్టింది. “ఆయీ నహి ఘర్(అమ్మ ఇంట్లో లేదు)”, అన్నదామె. నేను వారి రెండు గదుల ఇటుక, రాయి, మట్టితో కట్టిన ఇంటి గుమ్మం ముందు కూర్చున్నాను.
మలన్ మోర్ వాడి గ్రామంలో తన అమ్మ 63 ఏళ్ళ రహిబాయి, 83 ఏళ్ళ తండ్రి నానా(వారి పేర్లు, ఊరి పేర్లు మార్చబడ్డాయి)తో కలిసి ఉంటుంది. ఈ గ్రామం పూణే జిల్లా, ములాషి తాలూకాలో ఉంది. ఇక్కడ వారి కుటుంబం వారికున్న మూడు ఎకరాలలో వరి, గోధుమ, కూరగాయలు పండిస్తారు.
మలన్ కు 18 ఏళ్లప్పుడు ఆమెకు బోర్డర్ లైన్ మెంటల్ రిటార్డేషన్ ఉందని ససూన్ జనరల్ హాస్పిటల్ ద్వారా తెలిసింది.
దానికి 12 ఏళ్ల క్రితం ఆమె స్థానిక ప్రాధమిక పాఠశాలలో చదువుకున్నది. “ఆమె క్లాస్ లో ఆమెతో చదివేవారంతా నాలుగవ తరగతి పాసయ్యి పై తరగతిలోకి వెళితే ఆమె నేల మీద గీతాలు గీయడం తప్ప మరేమి చేయలేదు,” అని చెప్పింది రహిబాయి. చివరికి ఆ క్లాస్ టీచర్ ఆమెని స్కూల్ నుండి తీసేమని చెప్పింది. మలన్ కు అప్పుడు 15 ఏళ్ళు ఉండేవి.
అప్పటినుండి మలన్ ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ అమ్మతో ఉంటుంది. ఈ పనులు చేయడం కూడా ఆమెకు ఇష్టముంటేనే. ఆమె చాలా తక్కువ మాట్లాడుతుంది. అది కూడా తన అమ్మతో కాక ఇంకొందరితోనే. కానీ ఆమె అర్ధం చేసుకోగలదు, అర్ధవంతంగా మాట్లాడగలదు. నేను ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమె తల ఊపి, నవ్వి, తేలిగ్గా మాట్లాడింది.







